నేడు సీఎంలతో మోదీ చర్చలు.. లాక్‌డౌన్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న ఈ రోజేనా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 April 2020 4:13 AM GMT
నేడు సీఎంలతో మోదీ చర్చలు.. లాక్‌డౌన్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న ఈ రోజేనా.?

కరోనా వ్యాప్తి విస్తృత‌మ‌వుతున్న‌ నేపథ్యంలో దేశ‌వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14వ తేదీకి ముగియ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ తరువాత లాక్‌డౌన్‌ ఎత్తివేయాలా? కొన‌సాగించాలా? అన్న విష‌య‌మై ప్రధాని న‌రేంద్ర‌ మోదీ నేడు అన్ని రాష్ట్రాల సీఎంల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చ‌ర్చ‌లు జరపనున్నారు. ఈ చ‌ర్చ‌ల అనంతరం సీఎంల‌ అభిప్రాయాలు, సలహాలు, సూచ‌న‌ల మేర‌కు లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ది.

ఇదిలావుంటే.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశాయి. అలాగే మ‌ర‌కొన్ని రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌కే మొగ్గుచూపాయి. ఈ నేపథ్యంలో నేడు వెలువ‌డ‌నున్న‌ తుది నిర్ణయం కూడా ఇదే దిశగా ఉండవచ్చునని అంచనా. ఇక.. ప్ర‌ధాని మోదీ పార్ల‌మెంట‌రీ పార్టీల నేతలతో మూడు రోజుల క్రితం కూడా మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 14వ తేదీ తరువాత లాక్‌డౌన్ ఒకేసారి ఎత్తివేయడం కుద‌ర‌ద‌ని అన్నారు. ఈ నేఫ‌థ్యంలో లాక్‌డౌన్ మ‌రికొన్ని రోజులు పొడిగించే అవ‌కాశం లేక‌పోలేదు. ఏం జ‌ర‌గ‌నుందో తెలియాలంటే మ‌రికొన్ని గంట‌లు వేచివుండాల్సిందే.

Next Story