Fact Check : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించిందా..?
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Oct 2020 10:12 AM GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పాలిటిక్స్ లో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు. ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం కల్పించిందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.
"#జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరి భద్రత..తెలుగు రాష్ట్రాలతో పాటు పవన్ పర్యటించే ప్రాంతాలలో Z కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోం శాఖ ఆదేశం.." అంటూ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీలో భాగంగా 22 మంది భద్రతా సిబ్బంది, నలుగురు ఎన్.ఎస్.జి. కమాండర్లు రక్షణగా ఉంటారు.. అని చెబుతూ వాట్సప్ లలో మెసేజీలను వైరల్ చేస్తూ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ నడుస్తూ వెళుతుండగా.. చుట్టూ భద్రత ఉన్నఫోటోలు, నరేంద్ర మోదీని కలిసి ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.
'పవన్ కళ్యాణ్ got Z security.
Enjoy Maadi appa...
Hope, AP shouldn't become another UP under your leadership. As I know much much better than you about RSS(BJP) politics. Sorry.. your politics. నారాజు గాకురా maa annaya...' అంటూ కూడా ట్విట్టర్ లో పోస్టులు వెలిశాయి.
Pawan Kalyan Gets Z Category Security! | greatandhra https://t.co/GR0J8lxc0j
— Devarakonda Ramesh (@Urs_Ramesh_Urs) October 4, 2020
ఈ మెసేజీ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చాయి. ఆయన అభిమానుల్లో ఈ వార్తను చూడగానే కలవరం మొదలైంది. పవన్ కళ్యాణ్ కు ఎవరి నుండి ప్రమాదం పొంచి ఉందని జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఇచ్చారు అన్న ప్రశ్న కూడా వెంటాడింది.
పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదు.. ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినా కూడా మోదీ ప్రభుత్వం ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చింది అని కూడా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
నిజ నిర్ధారణ:
పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు అన్నది 'పచ్చి అబద్ధం'.
ఈ కథనాలపై జనసేన పార్టీ స్పందించింది. పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ కేటగిరీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని ప్రకటన ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కు సెక్యూరిటీ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను సంప్రదించలేదని.. పవన్ కళ్యాణ్ కూడా తనకు సెక్యూరిటీ కావాలని అడగలేదని జనసేన స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులను పార్టీ కార్యకర్తలు నమ్మకూడదని జనసేన సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తి చేసింది.
పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నప్పటికీ.. ఆయనకు ఎటువంటి సెక్యూరిటీని కావాలని కూడా కోరలేదు.. అలాగే ఆయనకు ఎటువంటి ప్రమాదం కూడా లేదని జనసేన పార్టీ తెలిపింది. పవన్ కళ్యాణ్ అభిమానులను, జనసైనికులను కలవరపెట్టే ఇలాంటి వార్తలను అసలు నమ్మకండి అని జనసేన పార్టీ సూచించింది. Gulte.com లో కూడా ఈ వదంతులపై కథనాలు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం కల్పించింది అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.