23 లక్షలు పెట్టి నల్లటి గుర్రాన్ని కొన్నాడు.. ఆ తర్వాత దానికి స్నానం చేయించగా..
Punjab man buys rare black horse for Rs 23 lakh. ఇటీవల, పంజాబ్లోని ఒక వ్యక్తికి గుర్రపు వ్యాపారులు రూ. 22.65 లక్షలకు మోసంచేశారు.
By Medi Samrat Published on 25 April 2022 3:00 PM GMT
ఇటీవల, పంజాబ్లోని ఒక వ్యక్తికి గుర్రపు వ్యాపారులు రూ. 22.65 లక్షలకు మోసంచేశారు. అతనికి అరుదైన జాతికి చెందిన ' నల్ల గుర్రాన్ని' విక్రయించారు. అయితే, నల్ల గుర్రాన్ని తీసుకుని వెళ్లి.. ఒక్కసారి కడగ్గా.. ఆ గుర్రం గోధుమ రంగులోకి మారింది. పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని సునమ్ నగరానికి చెందిన రమేష్ కుమార్ తాను కొన్న నల్ల గుర్రం.. నల్లగా లేదని తెలుసుకున్న తర్వాత షాక్ అయ్యాడు. దానికి స్నానం చేయగా గుర్రం గోధుమ రంగులో ఉండడంతో.. అసలు రంగు బయటకు వచ్చింది. తనకు వాగ్దానం చేసినట్లుగా నల్ల మార్వారీ గుర్రానికి బదులు దేశీ స్టాలియన్ని విక్రయించినట్లు రమేష్కు అర్థమైంది.
గుర్రపు వ్యాపారుల బృందం తనను మోసం చేసిందని అతను తెలిపాడు. సునమ్ నగరానికి చెందిన జతీందర్ పాల్ సింగ్ సెఖోన్, లఖ్వీందర్ సింగ్, లచ్రా ఖాన్ అలియాస్ గోగా ఖాన్లు కలిసి నల్ల గుర్రం కోసం డీల్ కుదుర్చుకున్నట్లు రమేష్ను మోసగించారు. మోసగాళ్లకు రూ. 7.6 లక్షల నగదు, మిగిలిన మొత్తానికి రెండు చెక్కుల రూపంలో దాదాపు రూ. 23 లక్షలు ఇచ్చాడు. పంజాబ్ పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో రిపోర్టు దాఖలు చేసిన తర్వాత, ఆ ముగ్గురు నిందితులు సంగ్రూర్ జిల్లాలో గుర్రాలను మోసగించిన మరో కేసు బయటపడింది. ఆ ముగ్గురు నిందితులు ఇతరులను కూడా మోసం చేయడానికి అదే పద్ధతిని ఉపయోగించారు.