ఊహించని వర్షాలు.. ఇప్పుడే ఎందుకు వస్తున్నాయంటే..?
ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో ఊహించని వర్షం, ఉరుములతో కూడిన గాలివాన కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
By - Medi Samrat |
ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో ఊహించని వర్షం, ఉరుములతో కూడిన గాలివాన కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ మధ్య లేదా చివరి వరకు భారతదేశం తీవ్రమైన వడగాల్పుల నుండి తప్పించుకోవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మార్చి మధ్య నాటికి మండుతున్న ఎండలకు బదులుగా, ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఉపరితల గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 3 నుండి 7 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోనున్నాయి.
పాశ్చాత్య అవాంతరాలు (Western disturbances) అనేవి మధ్యధరా సముద్రం మీద ఉద్భవించి, భారత ఉపఖండానికి చేరుకునే ముందు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మీదుగా తూర్పు వైపు ప్రయాణించనున్నాయి. ఇవి సాధారణంగా శీతాకాలంలో ఉత్తరాదిప్రాంతాలకు వర్షం, మంచును తెస్తాయి. ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల ఉంటుందని, వేడి మరికొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. మధ్యప్రదేశ్, గుజరాత్, దక్షిణ రాజస్థాన్, మహారాష్ట్రతో సహా కొన్ని ప్రదేశాలలో ఎండల నుండి ఉపశమనం లభించవచ్చని అంచనా వేస్తున్నారు.
IMD అంచనా ప్రకారం వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉంది. అస్సాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. మార్చి 15 మరియు 19 మధ్య జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉంది. వడగండ్ల వానలు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు, కొన్ని ప్రాంతాలలో గంటకు 50 నుండి 60 కి.మీల వేగంతో వీచే అవకాశం ఉంది, కొన్ని కొన్ని సార్లు గంటకు 70 కి.మీ వరకు కూడా చేరవచ్చు.