జనవరి 20న ట్రంప్ ప్రమాణస్వీకారం..భారత్ తరపున హాజరయ్యేది ఈయనే
అగ్ర దేశం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయి.
By Knakam Karthik Published on 12 Jan 2025 4:21 PM IST
జనవరి 20న ట్రంప్ ప్రమాణస్వీకారం..భారత్ తరపున హాజరయ్యేది ఈయనే
అగ్ర దేశం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయి. ఈ నెల 20న జరిగే ఈ కార్యక్రమానికి అగ్ర రాజ్యం పలు దేశాలకు ఆహ్వానం పంపుతోంది. భారత్కు కూడా ఇన్విటేషన్ అందింది. ట్రంప్ వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, భారతదేశం తరపున విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆయన అమెరికా టూర్లో ట్రంప్తో పాటు పలువురు అమెరికా ప్రతినిధులు, ఇతర నేతలతో సమావేశం అవుతారని కేంద్రం తెలిపింది.
అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 5న జరిగిన ఎన్నికల్లో కమలా హారీస్పై డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. కాగా జనవరి 20న అమెరికా 47వ నూతన ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అమెరికా క్యాపిటల్ బిల్డింగ్లోని వెస్ట్ ఫ్రంట్ ఏరియా వేదిక కానుంది. ఈ ప్రోగ్రామ్కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
డొనాల్డ్ ట్రంప్తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే 2020 ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓటమి పాలైన ట్రంప్.. జో బైడెన్ ప్రమాణస్వీకారానికి అప్పట్లో హాజరుకాలేదు.