మద్యం అనుకుని యాసిడ్ తాగేశారు.. ముగ్గురు మృతి

Three Men Die After Accidentally Drinking Acid Instead Of Alcohol. త్రిపురలో మద్యం మత్తులో యాసిడ్ తాగిన ఘటన చోటుచేసుకుంది. యాసిడ్‌ తాగిన

By Medi Samrat  Published on  30 Dec 2021 7:37 AM GMT
మద్యం అనుకుని యాసిడ్ తాగేశారు.. ముగ్గురు మృతి

త్రిపురలో మద్యం మత్తులో యాసిడ్ తాగిన ఘటన చోటుచేసుకుంది. యాసిడ్‌ తాగిన ముగ్గురు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన త్రిపురలోని ధలై జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం జ‌రిగిన ఓ పార్టీలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు మద్యానికి బదులుగా యాసిడ్ తాగి మృతి చెందారని త్రిపుర పోలీసులు తెలిపారు. మృతులను కృష్ణ జై పారాకు చెందిన సచింద్ర రియాంగ్ (22), హజర్ధన్ పారాకు చెందిన అధిరామ్ రియాంగ్ (40), నేపాల్టిలా ప్రాంతానికి చెందిన భబీరామ్ రియాంగ్‌గా గుర్తించినట్లు పోలీసు అధికారి రత్న సాధన్ జమాటియా తెలిపారు.

సోమవారం జరిగిన ఓ పార్టీలో ప్రమాదవశాత్తు ముగ్గురు యాసిడ్ తాగారని.. యాసిడ్ తాగే ముందు ముగ్గురూ మద్యం మత్తులో ఉన్నారని అధికారులు ధృవీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఓ పార్టీ జరిగింది. ఈ పార్టీకి చనిపోయిన ముగ్గురు సహా 10 మంది హాజరయ్యారు. పార్టీలో అతిగా తాగిన ఈ ముగ్గురు ప్రమాదవశాత్తు యాసిడ్ తాగారు. మద్యం మత్తులో ఉండడంతో యాసిడ్‌కి మందుకు మధ్య తేడాను అర్థం చేసుకోలేకపోయారు. ఘటన జరిగిన వెంటనే ముగ్గురిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి బుధవారం ఉదయం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు ప్రకటించారు.


Next Story