మోదీ గడ్డం గీయించుకోవాలని 100 రూపాయలు పంపిన టీస్టాల్ యజమాని
Tea vendor sends Rs 100 to PM Modi to get his beard shaved. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో గుబురుగడ్డంతో కనిపిస్తున్న
By Medi Samrat
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో గుబురుగడ్డంతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే..! చాలా రోజులుగా మోదీ గడ్డం పెంచుతూ ఉన్నారు. అయితే మోదీ గెడ్డం తీయించుకోవాలని మహారాష్ట్రలోని బారామతికి చెందిన ఓ టీ స్టాల్ యజమాని 100 రూపాయలు పంపాడు. మోదీ గెడ్డం పెంచుతూ పోతున్నారని, ఇకపై ఆయన ఏదైనా పెంచాలనుకుంటే అది దేశ ప్రజలకు ఉపయోగపడేది అయి ఉండాలని మోదీకి లేఖ రాస్తూ తన నిరసనను వ్యక్తం చేశాడు. వెంటనే గడ్డం గీసుకోవాలంటూ వంద రూపాయలు కూడా పంపాడు.
ఆయన పేరు అనిల్ మోరే. కరోనా కారణంగా గతేడాది నుంచి అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. బారామతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదురుగా టీస్టాల్ నిర్వహిస్తున్నాడు. మోదీ గెడ్డం పెంచడం మాని, ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు, వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రయత్నించాలని అనిల్ మోరే కోరాడు.
అనిల్ మోరే తన లేఖలో 'ప్రధాని నరేంద్రమోదీ గెడ్డం పెంచుతున్నారు. ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేది అయి ఉండాలి. దేశ జనాభాకు వీలైనంత వేగంగా టీకాలు వేయిండానికి, వైద్య సదుపాయాలను పెంచడానికి ఆయన ప్రయత్నాలు చేయాలి. చివరి రెండు లాక్డౌన్ల వల్ల కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపైనే ప్రధాని దృష్టి సారించాలని' తెలిపాడు
లాక్డౌన్ల వల్ల ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై ప్రధాని దృష్టి సారించాలని అన్నాడు. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో గౌరవమని .. తాను దాచుకున్న డబ్బుల నుంచి వంద రూపాయలు పంపిస్తున్నానని, ఆ డబ్బులతో ఆయన గడ్డం గీయించుకోవాలని సూచించాడు. మోదీని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, ఆయన ఈ దేశానికి అత్యున్నత నాయకుడని అన్నాడు. కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, లాక్డౌన్ వల్ల దెబ్బతిన్న కుటుంబాలకు రూ.30000 ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరాడు.