యోగి ఆదిత్యనాథ్ కు షాకిచ్చిన మంత్రి.. రాజీనామా చేసి అఖిలేష్ యాద‌వ్ పార్టీ గూటికి..

Swami Prasad Maurya Political Career Who left BJP and Joins SP. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాధ్ కెబినేట్‌ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య

By Medi Samrat  Published on  11 Jan 2022 11:14 AM GMT
యోగి ఆదిత్యనాథ్ కు షాకిచ్చిన మంత్రి.. రాజీనామా చేసి అఖిలేష్ యాద‌వ్ పార్టీ గూటికి..

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాధ్ కెబినేట్‌ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు పంపారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. స్వామి ప్రసాద్ మౌర్య బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) ని వీడి బీజేపీలో చేరారు. ప్ర‌స్తుతం బీజేపీని విడిచి 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్పీ(స‌మాజ్‌వాదీ పార్టీ)లో చేరారు.

రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జన్మించిన మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య.. అలహాబాద్ యూనివర్శిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు. 1980లలో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌లోకి ప్రవేశించాడు. అనంత‌రం అలహాబాద్ యువ లోక్ దళ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయ్యాడు. జూన్ 1981 నుండి 1989 వరకు జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. 1989 నుండి 1991 వరకు ఉత్తరప్రదేశ్ లోక్ దళ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. దల్మావు, రాయ్‌బరేలీ నుంచి బీఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేసి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2009లో పదరుణ అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన‌ ఉప ఎన్నికలో గెలిచారు. ఆ ఎన్నిక‌లో కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్ తల్లిని ఆయ‌న‌ ఓడించారు. మే 2002 నుండి ఆగస్టు 2003 వరకు ఆయ‌న‌ మంత్రిగా ప‌నిచేశారు. ఆగస్టు 2003 నుండి సెప్టెంబర్ 2003 వరకు ప్రసాద్ మౌర్య యుపి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు.

అనంత‌రం మౌర్యకు 2007 నుండి 2009 వరకు మంత్రి పదవిని నిర్వహించే అవకాశం వచ్చింది. జనవరి 2008లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. కానీ 2012 ఎన్నిక‌ల్లో ఎదురుదెబ్బ తర్వాత, బీఎస్పీ అధినేత్రి మాయావతి అతన్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించారు. ఆ తర్వాత 2016లో బీఎస్పీని వీడి బీజేపీలో చేరి యోగి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో.. మౌర్య మరోసారి పార్టీని వీడుతూ ఎస్పీ గూటికి చేరారు.


Next Story