లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ (EC) పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఎన్నికలను తారుమారు చేయడానికి ఈసీ బీజేపీతో కుమ్మక్కవుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని ఆరోపించారు. బెంగళూరు సెంట్రల్ లోక్సభ సీటులోని మహదేవపుర అసెంబ్లీ విభాగంలో ఓట్లకు సంబంధించి భారీ దొంగతనం జరిగిందని అన్నారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.
దేశంలో వస్తున్న ఎన్నికల ఫలితాలు అంచనాలను మించి ఉంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్లోనూ ఇదే విధంగా ఫలితాలు వచ్చాయని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలపై చేసిన పరిశోధనలో తమ అనుమానాలు నిజమయ్యాయని చెప్పుకొచ్చారు.