దేశంలో జనాభా, కుల గణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశ వ్యాప్త జనగణనపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

By Knakam Karthik
Published on : 4 Jun 2025 6:50 PM IST

National News, Population Count, Caste Census, Union Government, Bjp, Congress

దేశంలో జనాభా, కుల గణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశ వ్యాప్త జనగణనపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని నిర్ణయించింది. 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి తొలి దశ కులగణన.. 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కులగణన చేయనున్నారు. తొలి దశల్లో ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌లో కులగణన చేయబోతున్నారు. మహిళలు, పురుషుల లెక్కింపుతో పాటు కులం, ఉపకులాలను లెక్కించి జాబితా రూపొందించనున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ‘రిజిస్ట్రార్‌ జనరల్ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా’ పర్యవేక్షణలో జనాభా లెక్కలు నిర్వహిస్తారు

సాధారణంగా పదేళ్లకోసారి జనాభా లెక్కలు నిర్వహిస్తారు. చివరి సారి 2011లో దీన్ని నిర్వహించారు. 2021 జనాభా లెక్కలకు సంబంధించి 2020లోనే ఈ ప్రక్రియ చేపట్టాల్సింది. కానీ.. కొవిడ్‌ కారణంగా వాయిదా పడింది. ఎప్పుడు నిర్వహిస్తారనేదాని పైనా స్పష్టత లేకుండా పోయింది. సరైన సమయంలో నిర్వహిస్తామని 2024లో ఓ సందర్భంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు. 16 ఏళ్ల తర్వాత తొలిసారి జనాభా గణన నిర్వహించనున్నారు. ఇప్పటికే జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి 30కిపైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. కులగణనపై కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కులగణన పేరుతో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సర్వే చేయించారని, ఆ సర్వేల్లో పారదర్శకత లేదని కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా పారదర్శకంగా కులగణన చేయాలన్నదే మోడీ ప్రభుత్వ సంకల్పమని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించారు.

Next Story