పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన ఆ మూడు దేశాలు ఏవి.? లోక్‌సభలో ప్రస్తావించిన‌ ప్రధాని మోదీ

పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా ఉగ్రవాదం, అణు బెదిరింపులకు భారతదేశం ఇకపై తల వంచబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

By Medi Samrat
Published on : 29 July 2025 8:26 PM IST

పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన ఆ మూడు దేశాలు ఏవి.? లోక్‌సభలో ప్రస్తావించిన‌ ప్రధాని మోదీ

పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా ఉగ్రవాదం, అణు బెదిరింపులకు భారతదేశం ఇకపై తల వంచబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ కేవలం 22 నిమిషాల్లోనే ఖచ్చితమైన దాడులతో ఎలా స్పందించిందో ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా భారతదేశానికి ప్రపంచ దేశాల మద్దతు గురించి ప్రధాని మోదీ కూడా చాలా విషయాలు చెప్పారు. ప్రపంచంలోని ఏ దేశమూ భారత్‌ను తన సొంత భద్రత విషయంలో చర్యలు తీసుకోకుండా అడ్డుకోలేదన్నారు. పాకిస్థాన్‌కు మద్దతుగా ప్రకటనలు చేసిన మూడు దేశాలను కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 193 దేశాల్లో పాకిస్థాన్‌కు మద్దతుగా 3 దేశాలు మాత్రమే ప్రకటనలు ఇచ్చాయని అన్నారు. అది క్వాడ్ లేదా బ్రిక్స్ కావచ్చు, భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభించిందని ఆయన అన్నారు.

పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్‌ యొక్క చర్యల సమయంలో టర్కీ నిలకడగా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది. ఈ సమయంలో భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్‌లను టర్కీ స్వయంగా పాకిస్తాన్‌కు అందించింది. ఇది మాత్రమే కాదు.. డ్రోన్‌లతో పాటు, టర్కీ పాకిస్తాన్‌కు క్షిపణులు, జలాంతర్గాముల సహాయం కూడా అందించింది. టర్కీ ఈ వైఖరి తరువాత భారత్‌లో నిరంతర నిరసనలు జరిగాయి. ప్రజలు బహిరంగంగా టర్కీని బహిష్కరించారు. గత కొన్నేళ్లుగా కాశ్మీర్ సమస్యపై టర్కీ కూడా పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తిస్తోంది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత టర్కీ కాకుండా మరో దేశం పాకిస్థాన్ సానుభూతిపరులుగా మారింది. ఈ దేశం ఇరాన్ పొరుగు దేశం.. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఏర్పడిన దేశం అజర్‌బైజాన్.. ఇరాన్ నుంచి 2900 కిలోమీటర్ల దూరంలో ఉంది.

భారత్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి ఉగ్రవాదులను అంతమొందించినప్పుడు.. అజర్‌బైజాన్ కూడా పాకిస్థాన్‌కు భుజం తట్టింది. ఈ దేశం భారత్‌ యొక్క సైనిక దాడిని ఖండించింది. పాకిస్తాన్తో భుజం భుజం క‌లిపి నిలబడాలని మాట్లాడింది.

ఇరుదేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్న సమయంలో పాకిస్థాన్‌కు చైనా నిఘా, ఆయుధాలు, వ్యూహాత్మక సహకారం అందించింది. ఈ ఆపరేషన్‌లో భారత్ ఒకరు కాదు.. ముగ్గురు శత్రువులతో తలపడుతున్నారని భారత సైన్యం కూడా చెప్పింది. పాకిస్థాన్‌కు చైనా లైవ్ డేటా అందించిందని ఆర్మీ పేర్కొంది.

Next Story