సాధార‌ణ భ‌క్తుడిలా గురుద్వారాకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

PM Modi visits Gurudwara Rakabganj. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని రకబ్ గంజ్ సాహిబ్‌ను సంద‌ర్శించారు.

By Medi Samrat  Published on  20 Dec 2020 6:52 AM GMT
సాధార‌ణ భ‌క్తుడిలా గురుద్వారాకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని రకబ్ గంజ్ సాహిబ్‌ను సంద‌ర్శించారు. సిక్కు మ‌త బోధ‌కుడు గురు తేజ్‌ బహదూర్ కు నివాళులర్పించి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. షెడ్యూల్‌లో లేని ప‌ర్య‌ట‌న కావ‌డంతో.. ఎలాంటి బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌లేద‌ని అధికారులు తెలిపారు. నిన్న‌ సిక్కుల మత గురువు తేజ్ బహదూర్‌ జయంతి వేడుక జరిగింది. ఈ సందర్భంగానే ఈ రోజు ఉదయం మోదీ అక్కడ కనపడడం విశేషం. నారింజ రంగు జుబ్బాతో పాటు దానిపై ఆరెంజ్ రంగు కోటు, తెలుపు పైజామాతో ఆయన గురుద్వారా రికబ్ గంజ్ సాహిబ్‌ను దర్శించుకున్నారు. పూజా సామగ్రిని అక్కడ మతగురువుకు మోదీ అందించారు.

ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్‌లో గురు తేజ్‌ బహదూర్ సింగ్ సేవలను కొనియాడారు. గురు తేగ్ బహదూర్ సింగ్ జీవితం ఎంతో ఆదర్శనీయమన్నారు. ఆయన ధైర్యం, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని తెలిపారు. మా ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలోనే తేజ్ బ‌హ‌దూర్ 400వ ప్రకాశ్ ప‌ర్వ్ రావ‌డం ఆయ‌న దీవేన‌గా భావిస్తున్నాన‌ని.. ఆయ‌న అంతిమ సంస్కారాలు జ‌రిగిన ఈ ప‌విత్ర స్థ‌లాన్ని నేడు సంద‌ర్శించ‌డం ఆశీర్వాదంగా భావిస్తున్నాన‌ని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. చ‌ట్ట‌ల‌ను ర‌ద్దుచేయాలంటూ డిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌ణ కొన‌సాగిస్తున్న త‌రుణంలో మోడీ గురుద్వారా ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్పడింది.


Next Story