న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై తామిద్దరం లోతుగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తక్షణమే ఉద్రిక్తతలు తగ్గాలని, వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించాలని భారత్ బలంగా కోరుకుంటున్నట్లు మోదీ స్పష్టం చేశారు.
ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా, అందరికీ అందుబాటులో ఉండేలా తెరిచి ఉంచడం ప్రపంచ దేశాలన్నింటికీ అత్యంత ఆవశ్యకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో స్థిరత్వం కోసం తీసుకునే ప్రతి చర్యకు భారత్ మద్దతుగా ఉంటుందని, శాంతి ప్రయత్నాల విషయంలో తామిద్దరం నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు మోదీ తన ట్వీట్లో వెల్లడించారు.