ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదని న్యాయానికి ఒక ప్రతీక అని అన్నారు. భారత్ ఆపరేషన్ సింధూర్ కు దిగుతుందని తీవ్రవాదులు అసలు ఊహించి ఉండరని ప్రధాని మోదీ తెలిపారు. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడులు చేసిన ఆపరేషన్ సిందూర్లో ధైర్యవంతులైన సాయుధ దళాలు, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తల పాత్రకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్యూట్ చేశారు. సాయుధ దళాల ధైర్యసాహసాలను భారతదేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు అంకితం చేస్తున్నానని చెప్పారు.
భారత్ చేసిన దాడులకు పాకిస్థాన్ ఒక్కసారిగా షాక్ అయిందని అన్నారు ప్రధాని మోదీ. తీవ్రవాదులను అంతం చేయాలని భారత్ చేసిన ప్రయత్నాలకు ప్రతి స్పందనగా పాకిస్థాన్ చాలా చెత్త పని చేసిందని మోదీ అన్నారు. పాకిస్థాన్ భారత్ లోని స్కూళ్లను, గుళ్లను, గురుద్వారాలను లక్ష్యంగా చేసుకుందని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని ప్రధాని మోదీ తెలిపారు. పాకిస్థాన్ డ్రోన్స్, మిసైల్స్ ద్వారా దాడికి దిగిందని, అయితే పాకిస్థాన్ కుయుక్తులను భారత సైన్యం అడ్డుకుందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.