వారి మీద పూల వర్షం కురిపించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రామమందిర నిర్మాణ కార్మికులపై పూల వర్షం కురిపించారు.

By Medi Samrat  Published on  22 Jan 2024 3:16 PM GMT
వారి మీద పూల వర్షం కురిపించిన ప్రధాని మోదీ

సోమవారం అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రామమందిర నిర్మాణ కార్మికులపై పూల వర్షం కురిపించారు. కార్మికులను కుర్చీలలో కూర్చోబెట్టి ఓ బుట్టలో పూలు పట్టుకున్న మోదీ వారిపై చల్లుకుంటూ వెళ్లి గౌరవించారు. ఆయనే కార్మికుల దగ్గరకు వెళ్లి గులాబీ రేకులను వేశారు.

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయంపై పూల వర్షం కురిపించనున్నారు హారతులు పట్టే సమయంలో ఆర్మీ హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. 84 సెకన్ల 'అభిజీత్ ముహూర్త' సమయంలో జరిగే 'ప్రాణ్ ప్రతిష్ఠ'తో ప్రధాని మోదీ ఆలయంలో పలు ఆచారాలను నిర్వహించారు. ప్రధాని మోదీ రాముడి విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమక్షంలో ఈ వేడుక జరిగింది.

రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాల్సి ఉందని.. సర్వ శక్తులు కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేవ్ సే దేశ్... రామ్ సే రాష్ట్ర్... ఇదే మన కొత్త నినాదం అని మోదీ అన్నారు. దేశ సర్వోన్నత అభివృద్ధికి అయోధ్య రామ మందిరం చిహ్నం కావాలని అభిలషించారు.

Next Story