బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం
Odisha Assembly Bjp Mla Subash Chandra Panigrahi Suicide Attempt. ఒడిశా రాష్ట్రంలో వరి సేకరణ సమస్యలపై బీజేపీ శాసనసభ్యుడు గళమెత్తారు.
By Medi Samrat Published on 13 March 2021 4:01 AM GMTఒడిశా రాష్ట్రంలో వరి సేకరణ సమస్యలపై బీజేపీ శాసనసభ్యుడు గళమెత్తారు. ఏకంగా అసెంబ్లీలో శానిటైజర్ను తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అసెంబ్లీలో వరి సేకరణ సమస్యలపై.. ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి రణేంద్ర ప్రతాప్ స్వైన్ మాట్లాడుతున్నప్పుడు.. దియోగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సుబాష్ చంద్ర పానిగ్రాహి నిరసన వ్యక్తం చేస్తూ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయాత్నానికి ప్రయత్నించారు.
అలర్టైన ఇతర శాసనసభ్యులు పానిగ్రాహిని శానిటైజర్ తాగకుండా నిరోధించగలిగారు. వెంటనే శానిటైజర్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సుభాష్ మాట్లాడుతూ.. దియోఘర్లో వరి ధాన్యం సేకరణ జరగడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల క్వింటాల్ కంటే ఎక్కువ ధాన్యం అమ్ముడు పోలేదన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే శానిటైజర్ సేవించి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండీల వద్ద ధాన్యం దుర్వినియోగం, టోకెన్ వ్యవస్థ వంటి రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పానిగ్రాహి ఆరోపించారు.
ఇదిలావుంటే.. శాసనసభ ప్రారంభానికి ముందు ఉదయాన్నే ఎమ్మెల్యే సుభాష్ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బడ్జెట్ సెషన్స్ జరుగుతుండగా ఎమ్మెల్యే శానిటైజర్తో సభలో నిరసన వ్యక్తం చేసాడు. రైతుల నుండి అన్ని రకాల ధాన్యాన్ని సేకరించాల్సిందేనని గళం విప్పాడు.