ఇలాంటి ఉపద్రవం ఎదుర్కొంటామని అసలు ఊహించలేదు

Narendra Modi speech LIVE updates. భారతప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి మాట్లాడారు. ఇలాంటి ఉపద్రవం ఎదుర్కొంటామని

By Medi Samrat  Published on  7 Jun 2021 12:03 PM GMT
ఇలాంటి ఉపద్రవం ఎదుర్కొంటామని అసలు ఊహించలేదు

భారతప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి మాట్లాడారు. ఇలాంటి ఉపద్రవం ఎదుర్కొంటామని అసలు ఊహించలేదని మోదీ అన్నారు. ఎంతో మంది మన ఆప్తులను ఈ మహమ్మారి కారణంగా పోగొట్టుకున్నామని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి అందరూ కలిసి పోరాడుతూ ఉన్నామని తెలిపారు. భారత్ లో ఊహించని విధంగా ఆక్సిజన్ అవసరం ఏర్పడిందని.. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదని అన్నారు. ప్రస్తుతం కావాల్సిన ఆక్సిజన్ ఉందని అన్నారు.

భారత్ లో సొంతంగా వ్యాక్సిన్ తయారు చేయకపోయి ఉండి ఉంటే ఎన్నో కష్టాలు వచ్చి ఉండేవని అన్నారు. మన దేశంలో వ్యాక్సిన్ తయారు చేయడం వలనే ఇప్పుడు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చోటు చేసుకుంటోందని అన్నారు. లేకపోతే మిగిలిన దేశాల్లో వ్యాక్సినేషన్ పూర్తయ్యాకనే... మన దేశంలో మొదలై ఉండేదని అన్నారు. భారత్ లో వ్యాక్సినేషన్ ఊపందుకుందని.. రాబోయే రోజుల్లో మరింత వేగంగా వ్యాక్సినేషన్ మొదలవుతుందని అన్నారు. భారత్ లో రెండు వ్యాక్సిన్లను తయారు రూపొందించారని.. పెద్ద పెద్ద దేశాలకు ఏ మాత్రం భారత్ తీసిపోలేదని అన్నారు. గతేడాది ఏప్రిల్ నెలలోనే వ్యాక్సిన్ కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు. వ్యాక్సిన్ తయారీదారులకు కావాల్సిన సహాయం అందించామని అన్నారు. ఇతర దేశాల నుండి కూడా వ్యాక్సిన్లను కొనుక్కోడానికి సిద్ధమయ్యామని అన్నారు.

పిల్లలకు కరోనా సోకుతుందనే భయాలు ఉన్నాయని.. వారి కోసం వ్యాక్సిన్ల విషయంలో ప్రయోగాలు మొదలయ్యాయని అన్నారు. ముక్కులోకి వేసుకునే వ్యాక్సిన్ కూడా రాబోతోందని.. అదే కానీ జరిగితే భారత్ లో వ్యాక్సినేషన్ మరింత దూకుడుగా వెళుతుందని అన్నారు. కరోనాకు సంబంధించి ఎంతో సార్లు ముఖ్యమంత్రులతో చర్చలు నిర్వహించామని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే హెల్త్ వర్కర్లకు వ్యాక్సినేషన్ వేశామని.. అలా జరగకుండా ఉండి ఉంటే ఏమి జరిగి ఉండేదో ఊహించడానికే భయంగా ఉందని అన్నారు.

కరోనా కట్టడి చర్యలపై చాలా వరకూ రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చామని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కొందరు కావాలనే విమర్శలు చేశారని చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే వారి చేతిలో బాధ్యతలు అప్పజెప్పామో.. వారికి అసలైన విషయం తెలిసిందని అన్నారు. ఇకపై టీకా కోసం రాష్ట్రాలు ఒక్క పైసా ఖర్చు పెట్టక్కరలేదని.. జూన్ 21 నుంచి 18 ఏళ్ళు నిండినవారికి కేంద్ర‌మే ఉచితంగా టీకా ఇవ్వ‌నుంద‌ని మోదీ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు టీకా వేయడానికి కేవలం రూ.150 సర్వీస్ ఛార్జీ వసూలుకు అనుమతి ఉంద‌ని అన్నారు.



Next Story