'నేను 16 ఏళ్లుగా కాంగ్రెస్కు విధేయుడిగా ఉన్నాను'.. పార్టీతో విభేదాలపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ గురువారం పార్టీ అధినాయకత్వంతో విభేదాలపై తన మౌనాన్ని వీడారు.
By Medi Samrat
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ గురువారం పార్టీ అధినాయకత్వంతో విభేదాలపై తన మౌనాన్ని వీడారు. అగ్ర నాయకత్వంతో తనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. అయినా.. కాంగ్రెస్ పార్టీ అంటే, దాని విలువలు, కార్యకర్తలంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వంతో నాకు విభేదాలు ఉన్నాయని మీకు తెలుసునని అన్నారు. వాటిలో కొన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ దాని గురించి తెలుసు. నేరుగా వారితో మాట్లాడి పార్టీలోనే వీటిని పరిష్కరించుకుంటే బాగుంటుందన్నారు.
పార్టీ పిలవకపోవడంతోనే నిలంబూరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన తాను ప్రచారం చేయలేదని శశిథరూర్ చెప్పారు. 16 ఏళ్లుగా కాంగ్రెస్కు విధేయుడిగా ఉన్నానని.. విబేధాలు వచ్చినా పరిష్కరించుకోవచ్చని.. ఏవైనా విభేదాలుంటే సంబంధిత వ్యక్తులతో తలుపుల వెనుక చర్చిద్దామని, అంతటితో వదిలేయాలన్నారు.
"కాంగ్రెస్ పార్టీ, విలువలు, కార్యకర్తలు అంటే నాకు ఇష్టం, నేను వారితో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్నాను. వారి నిబద్ధత, అంకితభావం, ఆదర్శవాదాన్ని చూశాను" అని ఆయన అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్తో లేదా పార్టీ రాష్ట్ర నాయకత్వంతో విభేదాలున్నాయా.? అని అడిగిన ప్రశ్నకు ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటింగ్ జరుగుతున్నందున దాని గురించి ఇప్పుడే మాట్లాడదలుచుకోలేదని అన్నారు. నా స్నేహితుడు (కాంగ్రెస్ అభ్యర్థి) ఆర్యదాన్ షౌకత్ గెలవాలని కోరుకుంటున్న చోట ఓటింగ్ జరుగుతున్నందున ఆ సమస్యల గురించి (నాయకత్వంతో ఆయనకున్న విభేదాలు) మాట్లాడే సమయం ఇది కాదు అని శశి థరూర్ అన్నారు. పార్టీ నాయకత్వంతో నాకున్న అభిప్రాయభేదాలు కొన్ని మీడియాలో ప్రచురితమయ్యాయి కాబట్టి దానిని దాచలేం అన్నారు. నిలంబూర్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి, నిజాయితీగా పనిచేశారని, మాకు అద్భుతమైన అభ్యర్థి ఉన్నారు.. వారి పని ఫలితాలను చూడాలన్నారు.