న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని, ఆయన దేశ భద్రతకు "అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి" అని రిజిజు వ్యాఖ్యానించారు.
ANI వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ రిజిజు పలు అంశాలను ప్రస్తావించారు. రాహుల్ గాంధీ దేశంలోనే కాకుండా విదేశీ పర్యటనల్లో కూడా భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులతో చేతులు కలుపుతున్నారని రిజిజు ఆరోపించారు. నక్సలైట్లు, తీవ్రవాద సానుభూతిపరులు, వివాదాస్పద సిద్ధాంతకర్తలు మరియు అంతర్జాతీయ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులతో రాహుల్ నిరంతరం సమావేశమవుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
విదేశీ గడ్డపై ఉండి భారతదేశ అంతర్గత విషయాల గురించి మాట్లాడటం, దేశ ప్రతిష్టను తగ్గించేలా వ్యవహరించడంపై రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. "రాహుల్ గాంధీ కేవలం ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా, భారత వ్యతిరేక శక్తులకు ప్రతినిధిలా మారుతున్నారు. ఆయన కలిసే వ్యక్తులు, చేసే వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయి..అని కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు.