పీఎస్ఎల్వీ సి-51 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
ISRO completes launch rehearsal of PSLV-C51 mission. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ నెల 28న పీఎస్ఎల్వీ
By Medi Samrat Published on 25 Feb 2021 5:07 PM GMT
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ నెల 28న పీఎస్ఎల్వీ సి-51 వాహకనౌక శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి పంపించనుంది. ఆదివారం ఉదయం 10.24 గంటలకు రాకెట్ ప్రయోగం నిర్వహిస్తారు. ఈ ప్రయోగానికి సంబంధించిన లాంచ్ రిహార్సల్ ప్రక్రియ నేడు ముగిసింది. పీఎస్ఎల్వీ సి-51 రాకెట్ ద్వారా అమెజానియా-1తో పాటు మరో 18 ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడతారు. కాగా, భారత స్టార్టప్ లకు చెందిన రెండు ఉపగ్రహాలను కూడా ఈ వాహకనౌక ద్వారా పంపాలని నిర్ణయించగా, వాటిలో పిక్సెల్ సంస్థ రూపొందించిన ఆనందన్ అనే ఉపగ్రహానికి సాఫ్ట్ వేర్ సమస్యలు తలెత్తాయి. దాంతో ఆ ఉపగ్రహాన్ని జాబితా నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.
ఇటీవల ఇస్రో చీఫ్ కె.శివన్ మాట్లాడుతూ.. చంద్రునిపైకి మూడో మిషన్ ప్రయోగం చంద్రయాన్–3ని 2022లో ప్రయోగించే అవకాశముందని తెలిపారు. కోవిడ్–19 లాక్డౌన్ కారణంగా ఇస్రో చేపట్టాల్సిన చంద్రయాన్–3 వంటి పలు ప్రాజెక్టులు వాయిదా పడ్డాయని తెలిపారు. చంద్రయాన్–3ని 2020 చివర్లో ప్రయోగించాల్సి ఉండగా.. చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటర్నే చంద్రయాన్–3లో ఉపయోగిస్తామన్నారు. 2019లో చంద్ర యాన్–2 మిషన్లో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడంలో విఫలమైంది.
2019లో నిర్వహించిన చంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో, లోటుపాట్లను దిద్దుకుని ముందుకు వెళతామని వివరించారు. చంద్రయాన్-3 మాత్రమే కాకుండా, మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కూడా వాయిదా పడిందని శివన్ వెల్లడించారు. ఈ ప్రయోగాలను 2022లో చేపడతామని చెప్పారు. ఇస్రో భవిష్యత్తులో చేపట్టే గ్రహాంతర ప్రయోగాలకు చంద్రయాన్–3 కీలకం కానుంది. గత ఏడాది డిసెంబర్లో చేపట్టాల్సిన మొట్టమొదటి మానవ రహిత గగన్యాన్ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీని తర్వాత, మరో మానవ రహిత మిషన్ ప్రయోగం ఉంటుం దని, మూడో విడతలో ప్రధాన ప్రయోగం చేపడతామన్నారు. గగన్యాన్ ద్వారా 2022లో ముగ్గురు భారతీయులను అంతరిక్షం లోకి పంపనున్నారు.