హిమపాతంలో చిక్కుకున్న 30 మంది పౌరులను రక్షించిన భారత సైన్యం
Indian Army rescues 30 civilians trapped in avalanches in J&K. ఉత్తర భారత దేశంలో చలి తీవ్రమవుతూ ఉంది. ఇక కశ్మీర్ లాంటి ప్రదేశాల గురించి
By Medi Samrat Published on 18 Jan 2022 11:54 AM GMT
ఉత్తర భారత దేశంలో చలి తీవ్రమవుతూ ఉంది. ఇక కశ్మీర్ లాంటి ప్రదేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ప్రాంతాల్లో మంచు తీవ్ర స్థాయిలో కురుస్తూ ఉంది. జమ్మూకశ్మీర్లో తీవ్రమైన మంచు తుఫాన్ కారణంగా మంచుచరియలు కూడా విరిగిపడుతున్నాయి. చైకీబాల్ – తంగ్దార్ రోడ్డుపై చిక్కుకున్న సుమారు 30 మంది పౌరులను భారత ఆర్మీ రక్షించింది. వాళ్లంతా ఎన్హెచ్-701పై దట్టమైన మంచులో చిక్కుకుపోయారు. జనవరి 17-18 రాత్రి ఈ ఘటన జరిగింది. రోడ్డుపై మంచులో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ ఆపరేషన్లో జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ కూడా పాల్గొన్నట్లు ఆర్మీ తెలిపింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పౌరులు తమ వాహనాల్లో చిక్కుకుపోయారనే సమాచారం ఎన్సి పాస్లోని దళాలకు చేరిన వెంటనే, ఇండియన్ ఆర్మీ నుండి రెండు హిమపాతాల రెస్క్యూ బృందాలు, జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (జిఆర్ఇఎఫ్) బృందాన్ని సమీకరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, 14 మంది పౌరులను రక్షించి నీలంకు, 16 మంది పౌరులను సాధన పాస్ కు తీసుకువచ్చారు. రక్షించబడిన పౌరులందరికీ రాత్రిపూట ఆహారం, వైద్యం మరియు ఆశ్రయం కల్పించారు. రోడ్డు నుండి హిమపాతం, మంచు స్లైడ్స్ క్లియరెన్స్ తర్వాత మంగళవారం పగటిపూట పన్నెండు వాహనాలు తిరిగి పంపబడ్డాయి. మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కు దాదాపు ఐదు నుండి ఆరు గంటలు సమయం పట్టింది.