సోషల్ మీడియా వాడకంపై భారత సైన్యం కీలక మార్పులు చేసింది. సైనికులు, అధికారులు ఇన్స్టాగ్రామ్ను వీక్షించడానికి, పర్యవేక్షించడానికి మాత్రమే ఉపయోగించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్మీ సిబ్బందికి డిజిటల్ కార్యకలాపాలపై ఉన్న అన్ని ఇతర నియమనిబంధనలు అమలులో ఉన్నందున వారు పోస్ట్ చేయడం, లైక్ చేయడం లేదా కామెంట్స్ చేయడం సాధ్యం కాదు. ప్రతి ఆర్మీ యూనిట్ లకి ఈ సూచనలు జారీ చేశారు. సైనికులు వారి స్వంత అవగాహన, సమాచార సేకరణ కోసం సోషల్ మీడియాలో కంటెంట్ను వీక్షించడానికి, పర్యవేక్షించడానికి అనుమతించడమే ఈ మార్పుల లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. సైనికులు నకిలీ లేదా తప్పుదారి పట్టించే పోస్ట్ల గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించడంపై సైన్యం కాలానుగుణంగా మార్గదర్శకాలను జారీ చేస్తూ వస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా గతంలో వాటి వాడకంపై ఆంక్షలు విధించారు. కొన్ని సందర్భాల్లో, సైనికులు విదేశీ ఏజెన్సీలు ఏర్పాటు చేసిన హనీ ట్రాప్లకు బలై, సున్నితమైన సమాచారం లీక్ కావడానికి దారితీసినందున ఈ కఠినమైన నియమాలు అమలు చేస్తున్నారు.