ఉగ్రదాడి ఎఫెక్ట్‌..పాక్‌కు వ్యతిరేకంగా భారత్ సంచలన నిర్ణయాలు

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

By Knakam Karthik
Published on : 24 April 2025 6:59 AM IST

National News,  Jammu and Kashmir, Pahalgham Attack, India, Pakistan, Indus Water, National Security Cabinet Committee

ఉగ్రదాడి ఎఫెక్ట్‌..పాక్‌కు వ్యతిరేకంగా భారత్ సంచలన నిర్ణయాలు

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ మేరకు పాకిస్తాన్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక చర్యలకు ఆమోదం తెలిపింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలు పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారం రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ప్రకటించింది. అటారీ చెక్‌పోస్టును వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాక్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఇక 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ఇవే కీలక నిర్ణయాలు..

*ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ - అటారి తక్షణమే మూసివేయబడుతుంది. ఇప్పటికే ఆ మార్గం ద్వారా వచ్చిన వారు, 2025 మే 1లోగా తిరిగి వెళ్లవచ్చు.

*పాకిస్తాన్ పౌరులకు SAARC Visa Exemption Scheme (SVES) వీసాలపై భారతదేశ ప్రవేశం నిషిద్ధం. ఇంతకుముందు జారీచేసిన SVES వీసాలు రద్దు చేయబడ్డాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లోగా దేశం విడిచి *వెళ్లాలి.

*న్యూఢిల్లీ లోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నౌకాదళ, వాయుసేన సలహాదారులను ‘పర్సోనా నాన్ గ్రాటా’గా ప్రకటించి, వారిని వారంలోగా దేశం విడిచి వెళ్లమని ఆదేశించింది. ఇదే విధంగా భారత హైకమిషన్, *ఇస్లామాబాద్‌ నుంచి భారత్ తన సలహాదారులను వెనక్కి పిలుపు తీసుకుంది. ఈ పదవులను రద్దు చేసింది. అలాగే 5 మంది సపోర్ట్ స్టాఫ్ కూడా వెనక్కి పిలిపించనుంది.

*భారత్ మరియు పాకిస్తాన్ హైకమిషన్లలోని సిబ్బంది సంఖ్యను 55 నుండి 30కి తగ్గించనుంది. ఈ మార్పులు 2025 మే 1లోగా అమల్లోకి వస్తాయి.

సింధు జలాల ఒప్పందం రద్దు

భారత్ తీసుకున్న అత్యంత కీలకమైన చర్యల్లో 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిరవధికంగా నిలిపివేయడం ఒకటి. ఈ ఒప్పందం ప్రకారం సింధు, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలను ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. పాకిస్థాన్‌లోని కోట్ల మంది ప్రజలకు ఈ నదులే ప్రధాన నీటి వనరు. 1960 సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1965, 1971, 1999 యుద్ధాల సమయంలోనూ నిలిచిన ఈ చారిత్రక ఒప్పందాన్ని భారత్ ఇప్పుడు నిలిపివేసింది. సింధు నది ఒప్పందం రద్దు చేయడం వలన నీటిపారుదల, తాగునీరు మరియు జల విద్యుత్ కోసం నీటి లభ్యత గణనీయంగా తగ్గుతుంది, ముఖ్యంగా పంజాబ్ మరియు సింధ్ ప్రావిన్సులు, ఈ నదులపై ఎక్కువగా ఆధారపడినవి.

వ్యవసాయ అంతరాయం

వ్యవసాయం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, సింధు బేసిన్ దాని జీవనాడి. నీటి ప్రవాహం తగ్గడం వల్ల పంట వైఫల్యాలు, దిగుబడి తగ్గడం మరియు ఆహార అభద్రత ఏర్పడవచ్చు, ముఖ్యంగా గోధుమ, వరి మరియు పత్తి వంటి పంటలకు. జల విద్యుత్ లోటు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ లోని అనేక జల విద్యుత్ కేంద్రాలు పశ్చిమ నదులపై ఉన్నాయి. భారతదేశం ప్రవాహాన్ని నిలిపివేయడం లేదా నియంత్రించడం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది, దీని వలన విద్యుత్ కొరత ఏర్పడుతుంది..

కాగా దేశ భద్రతా పరిస్థితిని సీసీఎస్ సమీక్షించింది. అన్ని భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తతో విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిని చట్టానికి లోబడి శిక్షించడమే కాక, వారికి మద్దతు ఇచ్చిన వారినీ చర్యలను బహిరంగంగా బహిర్గతం చేసి చర్యలు తీసుకుంటామని సంకల్పించింది. తాజాగా తహవ్వూర్ రాణాను భారతదేశానికి అప్పగించిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఉగ్రవాదం పట్ల కఠినమైన ధోరణిని భారత్ కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.

Next Story