భారతదేశంలో దాదాపు రెండు నెలలకు సరిపడా చమురు, ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వదంతులపై ప్రజలు ఆందోళన చెందవద్దని కోరింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, దేశ ఇంధన పరిస్థితి స్థిరంగా, పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు. రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు సరఫరాలను ఇప్పటికే సురక్షితం చేసుకున్నట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 26, 2026 నాటి పీఐబీ ప్రకటన ప్రకారం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) దిగుమతులను ముందుగానే ఖరారు చేసుకున్నాయి, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నామని స్పష్టం చేసింది మంత్రిత్వ శాఖ.
హోర్ముజ్ జలసంధికి సంబంధించి ఆందోళనలు ఉన్నప్పటికీ, భారతదేశం 40కి పైగా ప్రపంచ సరఫరాదారుల నుండి ముడి చమురును పొందుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలు 100 శాతానికి పైగా సామర్థ్యంతో నడుస్తూ, ఇంధన సరఫరాను స్థిరంగా ఉంచుతున్నాయి.