త‌గ‌ల‌బ‌డుతున్న అట‌వీ ప్రాంతం.. ఒక్క‌రోజే 31 ప్రదేశాలలో చెలరేగిన‌ మంటలు

ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న వేడితో అక్క‌డి అడ‌వుల‌లో మంటలు చెల‌రేగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 24 గంటల్లో 31 కొత్త అగ్నిప్రమాదాలు సంభవించాయి

By Medi Samrat  Published on  27 April 2024 5:13 AM GMT
త‌గ‌ల‌బ‌డుతున్న అట‌వీ ప్రాంతం.. ఒక్క‌రోజే 31 ప్రదేశాలలో చెలరేగిన‌ మంటలు

ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న వేడితో అక్క‌డి అడ‌వుల‌లో మంటలు చెల‌రేగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 24 గంటల్లో 31 కొత్త అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ ప్ర‌మాదాల్లో మొత్తం 33 హెక్టార్ల అటవీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. ఇది కాకుండా కుమావోన్ వన్యప్రాణుల రిజర్వ్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మంట‌ల్లో ఇరుక్కొని చ‌నిపోయారు.

ఎండాకాలం కార‌ణంగా ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్ని ప్రమాదాలు త‌రుచుగా జ‌రుగుతూనే ఉంటాయి. అడవిలో మంటలను అదుపు చేసేందుకు అటవీ సిబ్బందితో పటు ఆర్మీ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్రంలోని రామ్‌నగర్, రుద్రప్రయాగ్, కేదార్‌నాథ్, న్యూ టెహ్రీ, రాణిఖేత్, అల్మోరా, బాగేశ్వర్, పితోర్‌గఢ్, చంపావత్, నరేంద్రనగర్, ఉత్తరకాశీ, తెరాయ్ ఈస్ట్, లాన్స్‌డౌన్, హల్ద్వానీ ఫారెస్ట్ డివిజన్, కలగఢ్ టైగర్ రిజర్వ్, రాజాజీ టైగర్ రిజర్వ్, నందా దేవి నేషనల్ పార్క్‌లో అడవిలో మంటలు చెలరేగాయి. అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసింది.

డెహ్రాడూన్ జిల్లా మేజిస్ట్రేట్ సోనిక శుక్రవారం రిషిపర్ణ ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అటవీ అగ్నిప్రమాదంకు సంబంధించి మార్గదర్శకాలను అందించారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక కమిటీని, గ్రామ రక్షక భటులను చురుగ్గా ఉంచాలని, మహిళా మంగళ్ దళాలతో సమన్వయం చేసుకోవాలని అటవీ శాఖ అధికారులను డీఎం ఆదేశించారు.

Next Story