నలుగురు లష్కరే తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
Encounter Underway Between Security Forces and Terrorists in Shopian.ఎన్ కౌంటర్ లో లష్కరే తాయిబా ఉగ్రవాదులుగా భావిస్తున్న నలుగురు హతమయ్యారు.
By Medi Samrat Published on
22 March 2021 5:07 AM GMT

జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కరే తాయిబా ఉగ్రవాదులుగా భావిస్తున్న నలుగురు హతమయ్యారు. మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది.
కాల్పులు తర్వాత ఘటనా స్థలంలో చూడగా నలుగురు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఒక ఏకే 47, ఒక పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 16న కూడా కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. అందులో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు.
Next Story