మోదీ, అదానీ మెగా స్కామ్పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ఎల్ఐసీ నిధులను దుర్వినియోగం చేస్తూ ‘మోదాని జాయింట్ వెంచర్’ దేశ ప్రజల సొమ్ముతో ఆడుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది
By - Knakam Karthik |
మోదీ, అదానీ మెగా స్కామ్పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ఎల్ఐసీ నిధులను దుర్వినియోగం చేస్తూ ‘మోదాని జాయింట్ వెంచర్’ దేశ ప్రజల సొమ్ముతో ఆడుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పార్టీ కమ్యూనికేషన్స్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైరాం రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 మేలో ఎల్ఐసీ నిధులలో రూ.33,000 కోట్లు వివిధ అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేలా ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ అధికారులు ప్రణాళిక రచించి ఆమోదం పొందారని చెప్పారు. ఈ నిర్ణయం “అదానీ గ్రూప్పై విశ్వాసం చూపడం” అనే పేరుతో తీసుకున్నదని, వాస్తవానికి అది ప్రభుత్వ ఒత్తిడిలోనూ, సంక్షోభంలో ఉన్న ప్రైవేట్ కంపెనీకి రక్షణ కల్పించే ప్రయత్నమని ఆరోపించారు. “ఇది ఒక పాఠ్య పుస్తకంలో వ్రాసేలా ‘మొబైల్ ఫోన్ బ్యాంకింగ్’ ఉదాహరణ కాదా?” అని ఆయన ప్రశ్నించారు.
జైరామ్ రమేష్ తెలిపిన ప్రకారం, 2024 సెప్టెంబర్ 21న అదానీపై అమెరికాలో వచ్చిన ఆరోపణల తరువాత కేవలం నాలుగు గంటల్లో ఎల్ఐసీకి ₹7,850 కోట్లు నష్టం కలిగిందని పేర్కొన్నారు. అదానీ ₹2,000 కోట్ల లంచకేసులో నిందితుడని, అయినా మోదీ ప్రభుత్వం అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) నోటీసును ఒక సంవత్సరం గడిచినా పంపలేదని ఆయన విమర్శించారు.
రమేష్ ప్రకటనలో “మోదాని మెగా స్కామ్” పరిధి విస్తృతమైందని, ఇందులో పలు అక్రమాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో ముఖ్యంగా ...ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను సంస్థలను దుర్వినియోగం చేసి ఇతర కంపెనీలను అదానీ గ్రూప్కి అమ్మేలా ఒత్తిడి తేవడం. విమానాశ్రయాలు, పోర్టులు వంటి కీలక ఆస్తులను అదానీకి కట్టబెట్టేలా ప్రైవేటీకరణలో మోసం చేయడం. భారత దౌత్య మార్గాల ద్వారా అదానీ గ్రూప్కి విదేశీ ఒప్పందాలు సంపాదించేలా ప్రయత్నాలు చేయడం. షెల్ కంపెనీల ద్వారా అధిక ధరల బొగ్గు దిగుమతి చేసుకోవడం, దాంతో గుజరాత్లో విద్యుత్ ధరలు పెరగడం. ఎన్నికల ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో అధిక ధరల విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవడం. బీహార్లో ఒక్క ఎకరా భూమిని రూ.1కి కేటాయించడం..అని రమేష్ వ్యాఖ్యానించారు.
“మోదాని మెగా స్కామ్పై సత్యాన్ని వెలికితీసే మార్గం కేవలం పార్లమెంటు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) విచారణ ద్వారానే సాధ్యం” అని. కనీసం ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) అయినా ఎల్ఐసీ పెట్టుబడి వ్యవహారాన్ని పూర్తిగా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.