బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు రాజు బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని అన్నారు. దుర్గాపూర్లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ పోలీసులు ప్రజల కోసం పనిచేయడం లేదని.. ప్రభుత్వం కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బంగ్లాలో గుండా రాజ్యం సాగుతోందని.. రాష్ట్రంలో జరిగే నేరాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాంటి వారిని ఏం చేయాలని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక వారితో బూట్లు నాకిద్దాం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
గత కొద్దిరోజులుగా భాజపా నేతలకు, మమత బెనర్జీ తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వార్గియా సైతం మంగళవారం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహిళా నేత ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. దేశమంతటా ఒక చట్టం నడుస్తుంటే.. బెంగాల్లో మాత్రం టీఎంసీ చట్టం నడుస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు.