యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ స్వీప్.. అయినా.. ఆ రికార్డు బ్రేక్ అవలేదు.!

BJP Sweeps Elections To UP Legislative Council. ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక సంస్థల పరిధిలోని 36 శాసన మండలి (ఎమ్మెల్సీ) స్థానాల్లో బీజేపీ 33 స్థానాలను గెలుచుకోగా

By Medi Samrat  Published on  12 April 2022 12:38 PM GMT
యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ స్వీప్.. అయినా.. ఆ రికార్డు బ్రేక్ అవలేదు.!

ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక సంస్థల పరిధిలోని 36 శాసన మండలి (ఎమ్మెల్సీ) స్థానాల్లో బీజేపీ 33 స్థానాలను గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఖాతా కూడా తెరవలేకపోయింది. రాష్ట్రంలోని 36 ఎమ్మెల్సీ స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే 9 స్థానాల్లో ఏకపక్షంగా గెలుపొందగా, మిగిలిన 27 స్థానాల్లో పోలింగ్‌ జరగ్గా బీజేపీ 24 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 33 సీట్లు గెలుచుకుని, ఎమ్మెల్సీగా మెజారిటీ మార్కును సాధించి చరిత్ర సృష్టించి ఉండవచ్చు, కానీ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రికార్డును ఇప్పటికీ బద్దలు కొట్టలేకపోయింది.

యూపీ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే సాధారణంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. ఉత్తర ప్రదేశ్ లోని 33 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు, అందులో ఇప్పటికే 9 మంది సభ్యులు ఏకగ్రీవంగా గెలుపొందగా, మంగళవారg ఫలితాల్లో 24 మంది గెలుపొందారు. జనసత్తా పార్టీకి చెందిన అక్షయ్ ప్రతాప్ సింగ్ ప్రతాప్‌గఢ్ స్థానం నుంచి, అన్నపూర్ణ సింగ్ వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా, విక్రాంత్ సింగ్ అజంగఢ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.

ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి స్థానంలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. మాఫియా డాన్, స్థానికంగా ఎంతో పట్టు ఉన్న బ్రిజేశ్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. బ్రిజేశ్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అధికారంలో ఉండగా 36 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 33 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, 2010లో మాయావతి ప్రభుత్వ హయాంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ 36 స్థానాలకు గాను 34 స్థానాలు గెలుచుకుని రికార్డు సృష్టించింది.













Next Story