ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో బుధవారం మధ్యాహ్నం 12.37 నుంచి 12.47 గంటల మధ్య భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కర్చీని అధిష్టించనున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు ప్రారంభోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే వారికి ఆహ్వానాలు పంపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు నుండి రైతు నాయకులు కూడా హాజరుకానున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవం నేపథ్యంలో పురోహితులు మంగళవారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రెండు రోజుల రాజశ్యామల యాగం ప్రారంభించారు. శృంగేరి పీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ నేతృత్వంలో మొత్తం 12 మంది ఋత్విక్కులు తొలిరోజు పుణ్యాహ్వాచనం, చండీ పారాయణం, మూలమంత్ర జపం తదితర క్రతువులతో యాగం నిర్వహించారు. బుధవారం యాగం పూర్తయిన తర్వాత నవ చండీ హోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నారు.