ఆర్డినెన్స్‌పై వైఖ‌రిని స్ప‌ష్టం చేసిన కాంగ్రెస్‌.. విప‌క్షాల భేటీకి హాజ‌రుకానున్న కేజ్రీవాల్

AAP to attend Bengaluru Opposition meet after Congress's support on Delhi ordinance. బెంగళూరులో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాల్గొనబోతోంది.

By Medi Samrat  Published on  16 July 2023 1:29 PM GMT
ఆర్డినెన్స్‌పై వైఖ‌రిని స్ప‌ష్టం చేసిన కాంగ్రెస్‌.. విప‌క్షాల భేటీకి హాజ‌రుకానున్న కేజ్రీవాల్

బెంగళూరులో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాల్గొనబోతోంది. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సీఎం కేజ్రీవాల్ స్వయంగా పాల్గొననున్నారు. ఢిల్లీ కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమకు మద్దతు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ను కోరింది. తాము ఆమ్ ఆద్మీ పార్టీతోనే ఉన్నామని కాంగ్రెస్ ఆదివారం స్పష్టం చేసింది. కాంగ్రెస్ నిర్ణయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బెంగళూరులో జరిగే విపక్షాల స‌మావేశంలో పాల్గొనాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.

రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. “సమావేశంలో ప్రతి అంశం వివరంగా చర్చించబడింది. నేను ఆర్డినెన్స్ దేశ వ్యతిరేక చట్టం అని చెబుతాను. ఈ ఆర్డినెన్స్‌ను సమర్థించే ప్రతి వ్యక్తి దేశ వ్యతిరేకి. ఈ కసరత్తులో కేజ్రీవాల్ జీ ఈ దేశంలోని రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఈ ఆర్డినెన్స్‌ను ఓడించేందుకు వారి మద్దతును కోరారని పేర్కొన్నారు. టీఎంసీ నుండి ఆర్జేడీ వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమ స్వరం పెంచారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. బెంగళూరు సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొంటుందని నేను చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.

విపక్ష నేతల సమావేశానికి కేసీ వేణుగోపాల్ బెంగళూరు చేరుకున్నారు. ఆర్డినెన్స్‌పై మీడియాతో మాట్లాడిన ఆయన.. దీనిపై కాంగ్రెస్‌ వైఖరి చాలా స్పష్టంగా ఉందని.. దానిని తాము వ్యతిరేకిస్తామన్నారు.

జూన్ 23న పాట్నాలో జ‌రిగిన‌ ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ సంకోచం చూపిందని ఆరోపిస్తూ ఆప్ బెంగుళూరు స‌మావేశంలో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ ఈ రోజు త‌మ వైఖ‌రిని స్ప‌ష్టం చేయ‌డంతో ఆప్ విప‌క్షాల భేటీకి హాజ‌రుకానుంది.


Next Story