కాపురంలో కలహాలు తెచ్చిందని గూగుల్ మ్యాప్స్పై ఫిర్యాదు
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 May 2020 2:10 PM GMTతాను వెళ్లని ప్రదేశాలకు వెళ్లినట్లు చూపించిందని గూగుల్ మ్యాప్స్ యాప్ కంపెనీపై తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాళ్లోకెళితే.. మయిలదుత్తురాయిలోని లాల్బహదూర్ నగర్కు చెందిన ఆర్. చంద్రశేఖరన్ అనే వ్యక్తి ప్రతిరోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తన భార్య చేతికి ఫోన్ ఇచ్చేవాడు.
అయితే.. ఆమె భర్త మీద అనుమానంతో గూగుల్ మ్యాప్స్లోని ‘యువర్ టైమ్లైన్’ సెక్షన్లోకి వెళ్లి చంద్రశేఖరన్ రోజంతా ఎక్కడ తిరిగింది ఏంటి అని వెతికేది. కాగా, ఓ రోజు గూగుల్ మ్యాప్స్ టైమ్లైన్లో అతడు వెళ్లిన ప్రదేశాలు కాకుండా వేరే ప్రాంతాలను కూడా చూపించింది. దాంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది.
జరిగిన సంఘటనతో విసుగు చెందిన చంద్రశేఖరన్.. పోలీసు స్టేషన్కు వెళ్లి గూగుల్ మ్యాప్స్ యాప్ కంపెనీపై ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ‘మే 20 గూగుల్ మ్యాప్ టైమ్లైన్లో చూపించిన ప్రాంతాలకు నేను ఇంతవరకూ వెళ్లలేదు. తప్పుడు సమాచారం కారణంగా మా కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు.