జగనన్న విద్యా కానుక వాయిదా
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Sept 2020 8:36 AM ISTసీఎం వైఎస్ జగన్ సర్కార్ ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో సెప్టెంబరు 5నుండి ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాలనుకుంది.
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్-19 అన్ లాక్ 4.0 మార్గ దర్శకాల ప్రకారం.. సెప్టెంబరు 30వ తేదీ వరకు పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించడంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమం అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమవుతుందని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు, అధికారులు గమనించాలని చినవీరభద్రుడు సూచించారు.
కాగా ఈ పథకం ద్వారా సీఎం జగన్ విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ నుంచి నోటు పుస్తకాలు, బూట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను తీర్చిదిద్దాలని సంకల్పించిన జగన్.. ప్రతి స్కూల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి విద్యార్థికి అన్ని సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు.