ఆఫ్రికన్ మార్కెట్లను కలుపుతూ ప్రధాన ఎయిర్లైన్ ప్రారంభం
By న్యూస్మీటర్ తెలుగు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆఫ్రికన్ మార్కెట్లకు కలుపుతూ ఇథోపియన్ ఎయిర్లైన్స్ కార్గో సేవలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి మొదటిసారి వచ్చిన ఇథోయోపియన్ ఎయిర్ లైన్స్ విమానం ద్వారా ఆఫ్రికా మార్కెట్లతో సంబంధాలు ఏర్పడ్డాయి.
ఈ ఇథోపియన్ విమానం ET 3612( అరైవల్స్) ET 3613 (డిపార్చర్స్) రాత్రి 8.16 గంటల సమయంలో హైదరాబాద్కు చేరుకుంది. మరలా రాత్రి 11.30 గంటలకు తిరిగి ఇథోయోపియా బయలుదేరింది. హైదరాబాద్ – ఇథోపియాల మధ్య ఈ నూతన విమాన సర్వీసు కారణంగా ఇక్కడి నుంచి ఆఫ్రికాలోని మార్కెట్లకు సంబంధాలు ఏర్పడతాయి. వారానికి ఒకసారి నడిచే ఈ ఇథోయోపియన్ ఎయిర్లైన్స్ కార్గో సేవలు.. 50 మెట్రిక్ టన్నుల సామర్యం కలిగిన బోయింగ్ 777-300 విమానం ద్వారా నిర్వహించబడతాయి.
తాజాగా.. ఇథోపియన్ ఎయిర్లైన్స్ చేరికతో ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహిస్తున్న స్పెషల్ కార్గో ఛార్టర్ విమానాల సంఖ్య వారానికి 12 ఫ్రెయిటర్లకు చేరింది. ఇవి హైదరాబాద్ను అమెరికా, యూరోపియన్ దేశాలు, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఫార్ ఈస్ట్ దేశాలలోని వివిధ ప్రదేశాలతో కలుపుతూ, అక్కడికి అత్యవసర సరుకులను చేరవేస్తున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ షెడ్యూల్డ్ ఫ్రెయిటర్లలో.. కాతే కార్గో, టర్కిష్ కార్గో, లుఫ్తాన్సా కార్గో, స్పైస్ ఎక్స్ ప్రెస్ కార్గో(డొమెస్టిక్, ఇంటర్నేషనల్) మరియు బ్లూ డార్ట్ కార్గోలు ఉన్నాయి.