భర్తపై అనుమానం.. కొడవలితో ముగ్గురు పిల్లలను నరికి చంపి.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య

Woman kills her 3 kids, dies by suicide in Uttarpradesh. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలోని కుల్పహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను చంపి, ఆపై ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on  4 Dec 2021 12:28 PM GMT
భర్తపై అనుమానం.. కొడవలితో ముగ్గురు పిల్లలను నరికి చంపి.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలోని కుల్పహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను చంపి, ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను సోనమ్ (35), విశాల్ (11), ఆర్తి (9), అంజలి (7)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్పహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్వారియా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కళ్యాణ్ సింగ్ అనే వ్యక్తి భార్య సోనమ్, కొడుకు విశాల్, కుమార్తెలు ఆర్తి, అంజలితో కలిసి నివసిస్తున్నాడు. కళ్యాణ్ దినసరి కూలీ పని చేస్తూ, ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవాడు.

శనివారం ఉదయం పొలం నుంచి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు మూసి ఉండడం గమనించాడు. అతను పదేపదే తలుపు తట్టి తన భార్య సోనమ్‌కు ఫోన్ చేసాడు. కానీ చాలా సేపటికి ఎలాంటి స్పందన రాకపోవడంతో అతను తన ఇంటి పైకప్పుపైకి వెళ్లి ఇంట్లోకి ప్రవేశించాడు. గదిలో తన భార్య సోనమ్‌ ఉరివేసుకుని కనిపించగా, సమీపంలో రక్తపు మరకలున్న కొడుకు విశాల్ మృతదేహం పడి ఉంది. కుమార్తెలు ఆర్తి, అంజలి మృతదేహాలు గొంతు కోసి మంచంపై మెత్తని బొంతతో కప్పబడి ఉన్నాయి. కళ్యాణ్ ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ముగ్గురు చిన్నారులను తల్లి నరికి చంపింది. పోలీసులు సోదా చేయగా గదిలో నుంచి రక్తపు మరకలతో విరిగిన కొడవలి లభించింది. సర్కిల్ ఆఫీసర్ (CO) సదర్ తేజ్ బహదూర్ సింగ్, కళ్యాణ్ మరియు చుట్టుపక్కల ప్రజలను ప్రశ్నించారు. ప్రాథమికంగా చూస్తే చిన్నారులను గొంతు కోసి హత్య చేసిన తర్వాత మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. "ఘటన గల కారణంపై మేము అన్ని కోణాల్లో పని చేస్తున్నాము" అని సర్కిల్‌ ఆఫీసర్‌ చెప్పారు. తదుపరి విచారణలో భర్త కళ్యాణ్‌పై భార్య అనుమానం పెంచుకుందని తేలింది. "తన భర్తపై సోనమ్‌కు అనుమానాలు ఉన్నాయని, భర్త కళ్యాణ్‌కు వేరే మహిళతో సంబంధం ఉందని ఆమె భావించిందని స్థానికులు విచారణాధికారులతో చెప్పారని, దీని కారణంగా ఆమె తరచుగా తన భర్తతో గొడవ పడుతుందని" అధికారి తెలిపారు.

Next Story