నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దుసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు బుచ్చిరెడ్డి పాలెంలో స్నేహితుడి అక్క నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో స్థానికులు పోలీసులు, 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మృతులను జీవన్, విఘ్నేష్, నరేశ్, అభిసాయి, అభిషేక్గా గుర్తించారు.
ప్రమాద ఘటనలో ఆరుగురు మృత్యువాత పడటంపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు అభిషేక్, జీవన్, నరేష్, యజ్ఞేష్, అభిసాయితో పాటు ఇట్లో ఉన్న వెంకటరమణయ్య మృతి చెందడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.