ఫిష్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలోని మురుగునీటి ట్యాంక్లో మునిగి ఐదుగురు కార్మికులు మృతి
Five Workers Lost Their Lives In Fish Processing Factory In Mangaluru. పెర్ముడే సమీపంలోని మంగళూరు స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎంఎస్ఈజెడ్)లోని ఫిష్ ప్రాసెసింగ్
By Medi Samrat Published on 18 April 2022 9:03 AM GMT
పెర్ముడే సమీపంలోని మంగళూరు స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎంఎస్ఈజెడ్)లోని ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఐదుగురు కార్మికులు ఫ్యాక్టరీలోని మురుగునీటి ట్యాంక్లో మునిగి మృతి చెందిన విషాద సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతులను మహ్మద్ సమీరుల్లా, ఉమర్ ఫరూఖ్, నిజాముద్దీన్ అలీస్, మిరాజుల్ ఇస్లాం, సరఫత్ అలీగా గుర్తించారు. మృతులు పశ్చిమ బెంగాల్కు చెందిన వారు. వారందరూ 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు గల వారు.
ఇదిలావుంటే.. హసన్ అలీ, కరీబుల్లా, అఫ్తాల్ మాలిక్ అనే మరో ముగ్గురు కార్మికులు ఆసుపత్రిలో చేరారు. క్షతగాత్రులను ఏజే ఆస్పత్రి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రష్యా మరియు చైనాలకు ఎగుమతులు చేసే శ్రీ ఉల్కా ఎల్ఎల్బిలో ఈ సంఘటన జరిగింది. కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్ రూబీ జోసెఫ్, ఏరియా మేనేజర్ కుభేర్ గాడే, సూపర్వైజర్ మహమ్మద్ అన్వర్, లేబర్ సేఫ్టీ సూపర్వైజర్ ఫరూక్లను బజ్పే పోలీసులు ఐపీసీ సెక్షన్ 304, 304 ఆర్/డబ్ల్యూ 34, 337, 338 కింద అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నివాసి రాజు గోరక్ నడుపుతున్న ఫ్యాక్టరీ అనేక భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. ట్యాంకులోని మురుగు నీటిని రోజూ ఖాళీ చేయడం లేదు. నీట మునిగి మృతి చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ, మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసు కమిషనర్ తెలిపారు. ప్లాంట్లో దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు, వీరిలో అత్యధికులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్కు చెందిన వారుగా గుర్తించారు.