ఉత్తర్ప్రదేశ్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మందికి గాయాలయ్యాయని సమాచారం. అయితే వీరంతా తీర్థయాత్రలో భాగంగా వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి వెళ్తుండగా జౌన్పుర్లో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారు శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి, బ్రాహ్మణతర్ల, పలాస ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు బాధితులను ఫోన్లో పరామర్శించారు. జౌన్పుర్ కలెక్టర్, వారణాసి విమానాశ్రయ అధికారులు, వైద్యులతో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.