సూపర్ స్టార్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Oct 2020 1:34 PM IST
సూపర్ స్టార్ రజినీకాంత్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాళ్లోకెళితే.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తనకు 6.5 లక్షల రూపాయల ఆస్తి పన్ను విధించడంపై నటుడు రజినీకాంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. చెన్నైలోని రజినీకి చెందిన రాఘవేంద్ర కళ్యాణ మండపంపై ఈ పన్ను చెల్లించాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపింది.
అయితే.. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో మార్చి 24 నుండి రాఘవేంద్ర కళ్యాణ మండపం మూసివేసి ఉందని.. అప్పటి నుంచి ఎలాంటి ఆదాయం లేనందున గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన ఆస్తి పన్ను చెల్లించలేమని రజినీ తరపు లాయర్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.
కాగా ఈ విషయమై మద్రాస్ హైకోర్టు జడ్జి అనిత సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజినీని కోర్టు హెచ్చరించింది. అయితే ఈ కేసును విత్డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజినీ తరపు లాయర్ కోర్టును కోరారు.