గోదావరి జిల్లాలో కరోనా ఉగ్రరూపం
By Medi Samrat Published on 26 July 2020 7:44 PM IST![గోదావరి జిల్లాలో కరోనా ఉగ్రరూపం గోదావరి జిల్లాలో కరోనా ఉగ్రరూపం](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/07/Corona-Cases-In-Godavari-Districts.jpg)
ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఇతర జిల్లాల్లోనూ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 7627 కేసులు నమోదయ్యాయి. మరో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 96298 కి చేరింది. 24 గంటల వ్యవధిలో తూర్పుగోదావరి జిల్లాలో 1095 కేసులు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 859 కేసులు వచ్చాయి.
కొవిడ్ వల్ల తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, కర్నూల్లో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, విజయనగరంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు చొప్పున మొత్తం 56 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1041కి చేరింది.
ఇదిలావుంటే.. రాష్ట్రంలో అత్యధికంగా 13486 కరోనా కేసులతో తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. 8412 కేసులతో పశ్చిమ గోదావరి జిల్లా నాలుగో స్థానంలో ఉంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 9041 యాక్టివ్ కేసులు ఉండగా.. 4324 మంది డిచ్చార్జ్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 5168 కేసులు ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా.. 3165 కోలుకున్నారు. ఇక కరోనా బారిన పడి తూర్పు గోదావరిలో 122 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 79 మంది మృత్యువాత పడ్డారు.