తిరుమలకు చేరుకున్న సీఎం జగన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2020 11:59 AM GMT
తిరుమలకు చేరుకున్న సీఎం జగన్

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ తిరుమలకు చేరుకున్నారు. జగన్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించ‌కుని మద్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అనంత‌రం సీఎం జ‌గ‌న్‌ రోడ్డుమార్గాన తిరుమ‌ల‌కు చేరుకున్నారు.

అంత‌కుముందు విమానాశ్రయంలో సీఎం జ‌గ‌న్‌కు ఉప ముఖ్యమంత్రులు కె. నారాయణ స్వామి, ఆళ్ల నాని, జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుప‌తి శాసన సభ్యులు భూమ‌న‌ కరుణాకర రెడ్డి స్వాగతం పలికారు. ఇదిలావుంటే.. సీఎం వెంట ఢిల్లీ నుండి ఎంపీలు మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి రావడం జరిగింది.

ఇక తిరుమలకు చేరుకున్న జ‌గ‌న్‌కు‌ పద్మావతి అతిథిగృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో పద్మావతి అతిథి గృహం వద్ద నుంచి సీఎం జగన్ అన్నమయ్య భవన్‌కు చేరుకోనున్నారు. కోవిడ్‌పై ప్రధాని మోదీతో జరిగే సమీక్షా సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్, హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొననున్నారు.

సాయంత్రం 6.15 నిమిషాలకు ఆంజినేయ స్వామి దేవాలయం వద్దకు సీఎం చేరుకోనున్నారు. అక్కడ నుంచి ఊరేగింపుగా 6.30 నిమిషాలకు శ్రీవారి ఆలయానికి చేరుకొని స్వామి వారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకొని వాహన మండపానికి చేరుకొని గరుడవాహన సేవలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

Next Story