విషాదం: పిడుగుపాటుకు 17 మంది మృతి

By సుభాష్  Published on  27 April 2020 10:58 AM GMT
విషాదం: పిడుగుపాటుకు 17 మంది మృతి

ఒక వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే మరో వైపు అకాల వర్షాల కారణంగా పిడుగు పడి అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. దేశ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో పిడుగు పడి మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక బీహార్‌లో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షాల కారణంగా పిడుగుపడి 12 మంది మృతి చెందగా, 8 మందికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ ఘటనపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతులంతా సరన్‌ జిల్లాకు చెందిన 9 మంది, జాముయ్‌లో ద్దరు, భో్‌పుర్‌లో ఒకరు ఉన్నారని అధికారులు తెలిపారు.

కరోనా వ్యాప్తితో లాక్‌డౌన్‌ ఉన్నందున మృతుల సంఖ్య తక్కువగానే ఉందని సీఎం తెలిపారు. అకాల వర్షాల కారణంగా పిడుగులు పడే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సీఎం ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఏకంగా 12 మంది మృతి చెందడం బాధ కలిగించిందని ముఖ్యమంత్రి అన్నారు.

తమిళనాడులో...

ఇక తమిళనాడులో కూడా పిడుగుపాటుకు నవ వరుడు సహా ఐదుగురు మృతి చెందారు. కాంచీపురంలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన నవ వరుడు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. అటు తిరువళ్లూరు జిల్లా నేమలూరులో రైతు చంద్రన్‌, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు నదిలో చేపలు పడుతున్న ఆనందన్‌, పొలానికి వెళ్తున్న విద్యార్థిని మహాలక్ష్మీలు పిడుగు పాటుకు మృతి చెందారు. అలాగే నమక్కల్‌ జిల్లా పరమత్తివేలూరులో మరో వ్యక్తిపై కొబ్బరి చెట్టు విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఏపీలో కూడా పిడుగు పడి మూడేళ్ల చిన్నారి కూడా మృతి చెందింది.

Next Story