రైతులు నష్టపోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం: జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 5 May 2025 1:28 PM IST

Andrapradesh, Ap Government, Cm Chandrababu, Ys Jagan, Heavy Rains, Farmers

రైతులు నష్టపోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం: జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో వర్షాలపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని, రైతులకు గాలికి వదిలేసిందని విమర్శించారు. ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఖరీఫ్‌లో వాతావరణం అనుకూలించక అంతంత మాత్రంగానే దిగుబడి రాగా.. గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోయారని, ఇప్పుడు చేతికి వచ్చిన పంట నీటిపాలవడంతో నష్టాల్లో కూరుకుపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై వైసీపీ నేతలతో జగన్ తాడేపల్లి నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి రైతులకు బాసటగా నిలవాలని, వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చేతికి వచ్చిన పంట నీటిపాలైందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పండ్ల తోటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో పాటు అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Next Story