అమరావతి: ఏఐ (AI) సదస్సు వేదికగా చైనా రోబో కుక్కను ప్రదర్శించి దేశ పరువును ప్రధాని మోదీ తీస్తుంటే.. చంద్రబాబు, జగన్, పవన్ల నోళ్లు ఎందుకు పెకలడం లేదని వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. అస్తవ్యస్తమైన సమ్మిట్తో 70 దేశాల ముందు భారత ప్రతిష్ట దిగజారుతుంటే వీరికి ఆవేదన కలగలేదా అని ప్రశ్నించారు. భారతీయ ప్రతిభను తొక్కిపెట్టి, చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తే దేశానికి జరిగిన అవమానం కనిపించడం లేదా అని నిలదీశారు. బాధ్యతారాహిత్యం గురించి బాబు, రాజకీయాల ఐక్యత గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు పలికినట్లే ఉందని ఎద్దేవా చేశారు.
దేశం కోసం రాహుల్ గాంధీ పోరాడుతుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి, అధికార పక్షాన్ని వెనకేసుకురావడం టీడీపి, వైసీపీలకు సిగ్గుచేటన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అంటే 'బాబు-జగన్-పవన్' అని, వీరంతా మోదీజీ కోసం పనిచేసే మౌత్ పీస్లని, బీజేపీ ఎదుట బానిసలని మండిపడ్డారు. చంద్రబాబుది అధికారిక పొత్తు అయితే, జగన్ ది అక్రమ పొత్తు అని విమర్శించారు. అమెరికా ప్రయోజనం కోసం సున్నా సుంకాలకు ఒప్పుకుని భారత రైతుల పాలిట మరణశాసనం రాస్తున్నారని, దీనిపై ఐవైసీ (IYC) చేసిన నిరసనను ఉగ్రకోణంతో చూడటం కేంద్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని షర్మిల స్పష్టం చేశారు.