ఆంధ్రప్రదేశ్లో 'యోగా'డే..ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు
యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెల 20వ తేదీన విశాఖ రానున్నారు.
By Knakam Karthik
ఆంధ్రప్రదేశ్లో 'యోగా'డే..ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు
జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెల 20వ తేదీన విశాఖ రానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ విడుదల అయింది. ఆ రోజు సాయంత్రం 6.50 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని, అక్కడ నుంచి నౌకాదళ గెస్ట్ హౌస్కి వెళ్లి రాత్రి బసచేస్తారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే యోగాసనాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనమవుతారని సమాచారం.
కాగా ప్రధానితోపాటు 5 లక్షల మంది యోగా చేసేలా విశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి వెయ్యి మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి, ఒక యోగా శిక్షకుణ్ని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం ఆంధ్రా వర్సిటీ, కేంద్ర ఆయుష్ విభాగాలతోపాటు రాష్ట్ర క్రీడా సంస్థ నిపుణులు విశాఖలో శిక్షణ ఇస్తున్నారు.
మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పాల్గొనేలా ప్రభుత్వం శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 తెల్లవారుజామున ప్రధాని మోదీ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం వద్ద యోగా చేయనున్నారు. మోదీతోపాటు కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకూ 22 కిలోమీటర్లు మేర దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు. ఇందుకోసం యోగా శిక్షకులనూ ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారు.