ప్రతి అడుగులోనూ సీఎం మహిళలకు అండగా ఉన్నారు : మంత్రి విడదల రజని

Minister Vidadala Rajini Praises CM Jagan. ప్రతి అడుగులోనూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అండగా ఉన్నారని వెల్లడించారు

By Medi Samrat  Published on  7 March 2023 2:00 PM GMT
ప్రతి అడుగులోనూ సీఎం మహిళలకు అండగా ఉన్నారు : మంత్రి విడదల రజని

రాష్ట్రంలో మహిళా సాధికారత, సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేశారని.. ఆయ‌న‌ వల్లే ఇది సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ది హిందూ పత్రిక నిర్వహించిన “మహిళా సాధికారత, సమానత్వం” అంశంపై పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ప్రతి అడుగులోనూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అండగా ఉన్నారని వెల్లడించారు. ప్రతి ఇంటిలో మహిళకు ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఒక కారణమన్నారు. నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందే అన్నారు. మహిళలకు అన్ని స్థాయిల్లో మేలు చేస్తున్నాం.. కాబట్టే తమ రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

మాటకు, చేతకు మన్నన ఇచ్చే మనసున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తామే నిలబడి ఎదగాలని మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రధానంగా అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపునేస్తం వంటి పథకాల ద్వారా సాధికారతతో పాటు తోడ్పాటు అందిస్తున్నామన్నారు. విద్యతోనే కుటుంబ తలరాతలు మారుతాయని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి జగన్‌ అమ్మఒడి ద్వారా ఏటా రూ.15,000ల ఆర్థిక సాయం, జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన, మెరుగైన, రుచికరమైన పౌష్టికాహారం, 9 రకాల వస్తువులతో కూడిన జగనన్న విద్యాకానుక కిట్, జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన వంటి పథకాలు విద్యారంగంలో అమలు చేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్నారన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 3255 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందించడమే గాకుండా చికిత్స అనంతరం రోగి కోలుకునే సమయంలో ఆర్థికంగా ఇబ్బంది ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. గర్భవతిగా ఉన్నప్పుడే మహిళలకు, పుట్టిన అనంతరం చిన్నారులకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా సంపూర్ణ పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీలు క్షేమంగా చికిత్స అనంతరం ఇంటికి చేర్చేలా తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, వైద్యం, భవిష్యత్ లో ఉద్యోగాల కల్పన వంటి అన్ని అంశాల గురించి ఆలోచిస్తోన్న ప్రభుత్వం తమదన్నారు. దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

కేబినెట్ లో మహిళలకు మంత్రులుగా అవకాశమివ్వడమే కాకుండా నామినేటెడ్ పనులు, నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ అవకాశం కల్పించారన్నారు. కడుపులో ఉన్న బిడ్డ మొదలుకొని చివరి దశ వరకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వం సేవలందిస్తోందన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, తమ ముఖ్యమంత్రి మహిళా పక్షపాత సీఎం అని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక అవకాశాలు కల్పిస్తున్న మంచి మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభం కాబోతుందని తద్వారా ప్రభుత్వ వైద్యులే ఇంటికి వచ్చి వైద్యం అందించే వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు.


Next Story