సెప్టెంబరు నాటికి వైజాగ్, కర్నూలులో క్యాన్సర్ ఆసుపత్రులు

సెప్టెంబర్ నాటికి వైజాగ్, కర్నూలులో ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రులు రానున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ తెలిపారు.

By అంజి  Published on  7 March 2023 10:10 AM GMT
Regional cancer hospitals,Vizag , Kurnool

ఏపీ హెల్త్ మినిస్టర్ విడుదల రజినీ

ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ తెలిపారు. దీని కింద సెప్టెంబర్ నాటికి వైజాగ్, కర్నూలులో ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రులు రానున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద క్యాన్సర్‌కు పూర్తి చికిత్సను ఉచితంగా అందజేస్తోందని మంత్రి తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఏపీలో కేన్సర్‌ చికిత్సా విధానాల్లో చేస్తున్న మార్పులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర కేన్సర్ కేర్ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, సీనియర్ అధికారులు, ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రుల సిబ్బంది, టాటా క్యాన్సర్ కేర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

2030 నాటికి ఏ ఒక్క రోగి కూడా క్యాన్సర్ చికిత్స కోసం రాష్ట్రం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి రజినీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాన్సర్‌ చికిత్సలో ఎంతో సంకల్పంతో పనిచేస్తున్నారు. గతంలో రాష్ట్రంలో క్యాన్సర్‌కు సరైన చికిత్స ఉండేది కాదని ఆమె అన్నారు. ''ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 400 క్యాన్సర్ వ్యాధులకు ఉచితంగా చికిత్స చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో క్యాన్సర్‌ చికిత్స అందించేందుకు సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.118 కోట్లు మంజూరు చేసింది'' అని మంత్రి తెలిపారు.

ఒక్క విశాఖలోనే కేన్సర్ చికిత్సకు సంబంధించిన పరికరాల కొనుగోలుకు రూ.46 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి రజనీ తెలిపారు. కర్నూలులో 120 కోట్ల రూపాయలతో ప్రాంతీయ క్యాన్సర్‌ ఆసుపత్రి అందుబాటులోకి వస్తోంది. విశాఖపట్నం, కర్నూలులో ప్రాంతీయ క్యాన్సర్‌ ఆసుపత్రులు సెప్టెంబర్‌ నాటికి సిద్ధం కానున్నాయి. మరో రెండు చోట్ల కూడా ప్రాంతీయ క్యాన్సర్‌ ఆసుపత్రులను నిర్మించే ప్రణాళికతో తాము ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక ఆసుపత్రి చొప్పున క్యాన్సర్‌కు సమగ్ర చికిత్స అందించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.

సమగ్ర కేన్సర్ కేర్‌పై ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను నోటిఫై చేయదగిన వ్యాధిగా ప్రకటించిన మూడో రాష్ట్రం ఏపీ అని అన్నారు. ''తిరుపతిలోని బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీని ప్రభుత్వం ప్రాంతీయ కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. పీడియాట్రిక్ ఆంకాలజీ సేవలను అందించడంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్‌కు సమగ్ర చికిత్సను ఉచితంగా అందించడం పట్ల సీఎం జగన్ ఆసక్తిగా ఉన్నారు'' అని తెలిపారు.

Next Story