ప్రజలు ఛీ కొట్టారు.. ఆయన రియాక్ట్ అవరు : మంత్రి పెద్దిరెడ్డి
Minister Peddireddy Ramchandrareddy Comments On Chandrababu. సీఎం వైయస్ జగన్ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి ప్రజలు పట్టం కట్టారని రాష్
By Medi Samrat
సీఎం వైయస్ జగన్ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి ప్రజలు పట్టం కట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, భూగర్భ గనులు, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ పాలనలో కులం, మతం, ప్రాంతం, వర్గం అనే వివక్షత లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాల ఫలితమే ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ విజయమని అన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లీనిక్స్ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి గ్రామంలోనూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం వైయస్ జగన్ చేస్తున్న కృషికి ప్రజలు మద్దతు పలుకుతున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చేసుకుని ఈ రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ పాలన చేస్తున్నారని అన్నారు.
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, పరిషత్, మున్సిపోల్స్లో వరుసగా వైయస్ఆర్సిపి ఘన విజయాలను సాధించిందని, కుప్పం ప్రజలు ఛీ కొట్టిన తరువాత ఇంకా కుప్పం గురించి చంద్రబాబు మాట్లాడతాడని తాము భావించడం లేదని అన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవడానికి టిడిపి అనేక దౌర్జన్యాలకు పాల్పడిందని గుర్తు చేశారు. చివరికి చంద్రబాబు హైకోర్ట్కు వెళ్ళి ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించుకునేలా ఉత్తర్వలు తెచ్చుకున్నరని అన్నారు. ప్రజలు వైయస్ఆర్సిపికి అండగా ఉంటే, డబ్బు పంపిణీ చేశామంటూ మాపైన తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్న తమకు డబ్బు పంపిణీ చేయాల్సి అవసరం లేదని అన్నారు.