ప్రధాని మోడీకి లేఖ రాసిన అమరావతి ఐకాస.. కారణం అదేనా.!

Letter from Amravati leaders to Prime Minister Modi. రాష్ట్ర హైకోర్టు అనుమతితో న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టామని లేఖలో తెలిపారు.

By అంజి  Published on  22 Nov 2021 7:01 AM GMT
ప్రధాని మోడీకి లేఖ రాసిన అమరావతి ఐకాస.. కారణం అదేనా.!

భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతి ఐకాస లేఖ రాసింది. తమ పాదయాత్రను విజయవంతంగా పూర్తయ్యేందుకు జోక్యం చేసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐకాస నాయకులు ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్ర హైకోర్టు అనుమతితో న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టామని లేఖలో తెలిపారు. అయితే తమ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని వివరించారు. కొన్ని సందర్భాల్లోనైతే పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారని అమరావతి ఐకాస నాయకులు లేఖలో ఆరోపించారు. అమరావతి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్మూలిస్తోందన్నారు. అమరావతి ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు.

అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. మూడు రాజధానులు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. ఇవాళ్టి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దు చేసిందని వివరించారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి దాదాపు రెండేళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోను కేసులు నడుస్తున్నాయి. అయితే తాజాగా రాష్ట్ర మంత్రివర్గం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story