విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలు

1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాక్ జలాంతర్గామి ఘాజీ కుట్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By Medi Samrat  Published on  23 Feb 2024 12:42 PM GMT
విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలు

1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాక్ జలాంతర్గామి ఘాజీ కుట్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగాళాఖాతంలోకి విశాఖపట్నం వరకు చొచ్చుకొచ్చి భారత్‌ను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించింది. అయితే పాకిస్థాన్ కుట్రలు ఫలించలేదు. అయితే పాక్ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాలను భారత నౌకాదళం గుర్తించింది. ఇండియన్ నేవీలోని సబ్‌మెరైన్ రెస్క్యూ విభాగం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వీటిని గుర్తించింది.

ఘాజీ శకలాలను ‘ది డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్‌వీ) సాయంతో కనుగొన్నారు. విశాఖపట్టణం తీరానికి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర గర్భంలో 100 మీటర్ల లోతున శకలాలు ఉన్నట్టు గుర్తించారు. యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళ ఆచారం కావడంతో వాటిని తాకలేదని భారత నౌకాదళం తెలిపింది.

2013లో ఐఎన్ఎస్ సింధ్‌రక్షక్ ప్రమాదానికి గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాల సమయంలో సిబ్బందిని రక్షించేందుకు వీలుగా 2018లో తొలిసారి డీఎస్ఆర్‌వీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. నౌకలు, జలాంతర్గాములు ప్రమాదానికి గురైనప్పుడు వాటిని గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ సాంకేతికతను ఉపయోగిస్తారు. ప్రస్తుతం నేవీ వద్ద రెండు డీఎస్ఆర్‌వీలు అందుబాటులో ఉన్నాయి. భారత్ సహా 12 దేశాల వద్ద మాత్రమే ప్రస్తుతానికి ఇలాంటి సాంకేతికత అందుబాటులో ఉంది.

డిసెంబర్ 4, 1971న విశాఖపట్నం తీరంలో 93 మంది వ్యక్తులతో (11 మంది అధికారులు, 82 మంది నావికులు) పాకిస్థానీ జలాంతర్గామి PNS ఘాజీ మునిగిపోయింది. విశాఖపట్నంపై దాడి చేయాలని పాకిస్థాన్ కుట్రపన్నింది. బంగ్లాదేశ్ ఆవిర్భావం కోసం భారత్ పోరాడింది. అప్పటి యుద్ధంలో ఇది కీలక ఘట్టంగా పరిగణిస్తారు. భారతదేశంలోని తూర్పు సముద్ర తీరంలోని INS విక్రాంత్‌ను నాశనం చేయడానికి.. USలో తయారైన PNS ఘాజీని పాకిస్థాన్ పంపింది. ఘాజీ నవంబర్ 14, 1971న కరాచీ నుండి బయలుదేరి వైజాగ్ తీరానికి చేరుకోవడానికి భారత ద్వీపకల్పం చుట్టూ నిశ్శబ్దంగా 4,800 కి.మీ. ప్రయాణం చేసింది. భారత నావికాదళం డిస్ట్రాయర్ INS రాజ్‌పుత్‌ను పంపింది. ఇది ఘాజీని ట్రాక్ చేసి.. మునిగిపోయేలా చేసింది.

Next Story